తెలుగు సాహితీలోకమంతా గర్వపడాల్సిన విధంగా రచనలు చేసిన రచయిత కాశీభట్ల వేణుగోపాల్. కానీ అప్పటికే ఏర్పరచబడిన పఠనాభిరుచులతో, ఇదే సాహిత్యం అని స్థిరాభిప్రాయం ఏర్పరుచుకుని ఇప్పటికీ అదే పాత సాహిత్యం చదువుకుంటూనో, లేదంటే అసలు చదవడమే మానేసిన తెలుగు పాఠకుల మధ్యలో అస్సలు ఉండాల్సిన రచయిత కాదు కాశీభట్ల వేణుగోపాల్. ఎక్కడో ఏదో చిన్న యూరోపియన్ దేశంలో పుట్టబోయి దారితప్పి ఇక్కడ తెలుగుదేశంలో పడిపోయాడీయన. మధ్యతరగతి బతుకుల్లోని సాధారణతను, తెలుగు సాహిత్యం అనే environment లోని కంట్రోల్డ్ నెస్ నీ స్వయంగా విస్మరించి ఒక కొత్త ఎక్స్ప్రెషన్ అన్వేషణలో ప్రయోగాలు చేస్తూ తన దారిని తానేసుకున్న రచయిత కాశీభట్ల. నిరంతరం ఏదో తెలియని వెలితి. చింత. ఎగిరిపోవాలనే కోరిక. రెక్కలు తెంపబడ్డ పక్షి. వింతప్రపంచంలో అజ్ఞాతవాసి. పరిస్థుతులకు ఎదురీదుతూ నిరంతర పోరాటం. ఇబ్బందులు. ఇరుకు ఇళ్ళు. అంతే ఇరుకు మనసులు, తీరని కోరికలు – మధ్యతరగతి జీవితంలోని ఈ అంశాలన్నీ అక్షరాలై ఖాళీ పేజీల్లోకి ప్రపహించడమే కాశీభట్ల రచనలు. రోజువారీ జీవితంలోని దుమ్మూ ధూళితో కప్పబడిన జీవితపు అస్పష్టతలను తొలగించి మనిషిలోని నిజరూపాన్ని బయటపెట్టే ప్రయత్నమే కాశీభట్ల రచనలు. అంతేకాదు చదివే పాఠకుల స్వంతభావనల వెనుక వున్న స్వాతిశయాన్నీ, నార్సిసిజంనీ బట్టబయలు చేస్తాయి. మొదటి నవల “నేనూ-చీకటి” నుంచి ఇప్పుడు వస్తున్న సరికొత్త నవల “అసత్యానికి ఆవల” వరకూ ప్రతీ కథలో ఇదే ఆయన ప్రయత్నం.